మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ వద్దనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో డీలా ఫర్మామేన్స్ కనబరుస్తారన్న వారిని ఎన్నికల రణ క్షేత్రం నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తన ఎజెండాను మెల్లి మెల్లిగా అమలు చేయాలనే ఆలోచనకొచ్చేశారు కేసీఆర్. అయితే వద్దనుకున్న శాసన సభ్యులను ఊరికే పార్టీ నుంచి బయటకు పంపడమో..లేక..బీఆర్ఎస్ బీ-ఫామ్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే కేసీఆర్కు బద్నాం తప్పదు.
అయితే ఇది ఎంత మాత్రం ఇష్టం లేని కేసీఆర్ తెరపైకి తన పాత ఎత్తుగడను తెచ్చినట్లు చెబుతున్నారు ఆయనను దగ్గర నుంచి చూసిన రాజకీయ విశ్లేషకులు. గతంలో కేసీఆర్ ఎంతో మంది నేతలకు పొలిటికల్ గా మంచి పదవులు కట్టబెట్టారు. చాలా మంది నేతలను అందలమెక్కించారు. రాజకీయంగా పబ్లిక్లో పెద్దగా పట్టులేని వారికి కూడా ఆయన పదవులు ఇచ్చారు.
మరికొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో అమాత్య పదవిని అప్పగించారు. అయితే తర్వాత కాలంలో తన రాజకీయ అవసరాల కోసం వారి పదవులను సైతం ఊడకొట్టారు. ప్రభుత్వం, పార్టీలో ఎలాంటి భాగస్వామ్యం లేకుండా చేశారు. ఇలా బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాజకీయ దాహానికి బలైన మంత్రులే తాటికొండ రాజయ్య, ఈటల రాజేందర్.
ఇక వీరిద్దరిని మంత్రి పదవుల నుంచి తప్పించే క్రమంలో వారిపై అవినీతి ఆరోపణలు మోపారు. ఆరోగ్య మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్య మార్చురీలోని శవాలు అమ్ముకుంటున్నారనే తీవ్రమైన ఆరోపణలు చేయించారు. తనకు అనుకూలంగా ఉండే పత్రికల ద్వారా తాటికొండకు వ్యతిరేకంగా పుంకాను పుంకాలుగా కథనాలు రాయించారు.
మొత్తంగా ఆయన మినిస్ట్రీని పీకేసే టైంలో ఆయనో పెద్ద దొంగ అన్నట్లు ప్రోజెక్ట్ చేసేశారు. ఇక ఈటల రాజేందర్ విషయంలోనూ ఇదే సూత్రాన్ని అమలు చేశారు కేసీఆర్. ఈటలతో కేసీఆర్ ఫ్యామిలీకి ఎన్నటికైనా ఇబ్బందులు తప్పవనే అంచనాకు ఆయన వచ్చినట్లు సమాచారం. అందుకే ఆయనపై అసైన్డ్ భూములను ఆక్రమించారనే ఆరోపణలు చేయించి ఆగమేఘాల మీద ఈటలను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేశారు.
కేసీఆర్ ఎత్తుగడ..
ఇక ఇప్పుడు ఇదే ఎత్తుగడను సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నా రు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో కేసీఆర్ సిట్టింగ్లు అందరికీ టికెట్లు రాకపోవచ్చనే సంకేతాలు పంపించారు. అంతేకాదు వారు దళిత బంధులో కమీషన్లు దండుకుంటున్నార నే ఆరోపణలు కూడా చేశారని అన్ని ప్రముఖ పత్రికలు ప్రధానంగా కథనాలను రాశాయి. అయితే రాబోయే ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొదనే ఇలాంటి ప్రకటనలను కేసీఆర్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే వారిని ఊరికే పార్టీ నుంచి బయటకు పంపితే బాగుండదనే ఉద్దేశ్యంతోనే వారి క్యారెక్టర్ను బ్లేం చేసేందుకు దళిత బంధు స్కీంలో కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి దళిత బంధు స్కీంను ప్రవేశపెట్టి.. పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న టైంలో కేసీఆర్ ఎమ్మెల్యేలపై ఎందుకు నిఘా పెట్టలేకపోయారనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని నిఘా వర్గాలు ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటుంటే ఆయనకు సమాచారం ఇవ్వలేదా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు దళిత బంధు అమల్లో అధికార పార్టీ శాసన సభ్యులు కమీషన్లు దండుకుంటున్నారని మీడియా,ప్రసార మాధ్యమాల్లో చాలా కథనాలే వచ్చాయి. అయితే ఇవేవి పట్టనట్లు,తనకు తెలియనట్లు అప్పట్లో గమ్మున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలను దొంగలుగా చిత్రీకరించడం.. ముమ్మూటీకి వారిని వదిలించుకోవడానికి తప్ప మరోటి కాదనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.