Ambati Rayudu : టీమిండియా వన్డే మాజీ స్పెషలిస్ట్ క్రికెటర్ అంబటి రాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్ కు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించారు. గతంలోనూ రిటైర్మెంట్ ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పడు మరోసారి మనసు మార్చుకునే ఉద్దేశం లేదని తెలుస్తున్నది. నో యూటర్న్ అని క్యాప్షన్ తో ట్వీట్ చేయడాన్ని బట్టి తన భవిష్యత్ ప్రణాళిక మరొకటి ఉండబోతున్నదని అర్థమవుతున్నది. అయితే తదుపరి అడుగులు ఎటువైపు మళ్లుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఈ 38 ఏళ్ల క్రికెటర్ రాజకీయాల వైపు అడుగులు వేయొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై రాయుడు ఎలా స్పందిస్తాడోననే ఉత్కంఠ నెలకొంది. అయితే గతంలో క్రికెటర్లు అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్దూ, గౌతమ్ గంభీర్ లాంటి క్రికెటర్లు రిటైర్మెంట్ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు.
అయితే రాయుడు రెండు వారాల క్రితం ఏపీ సీఎం జగన్ ను తాడేపల్లిలోకలిశారు. కొంతకాలంగా ఆయన ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ పాలను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. దీనిని బట్టి రాయుడు రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారని పలువురు భావిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలని ఉందని, పాలిటిక్స్ పై ఆసక్తిగా ఉన్నట్లు స్వయంగా రాయుడు కూడా గతంలో చెప్పడం పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ కన్ఫాం అని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ప్రస్తతు ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
అకాడమీ ఆలోచనలో అంబటి..
జాతీయ జట్టుకు గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు తాజాగా ఐపీఎల్ కూ గుడ్ బై చెప్పేశాడు. మిగతా టోర్నమెంట్లకూ దూరంగా ఉండే అవకాశాల ఎక్కువగా ఉన్నాయి. రాయుడు వయసు 38 ఏళ్లు. రెండు సీజన్లుగా అతడి ఐపీఎల్ ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ ఆటను ప్రదర్శించినది కూడా ఏమీ లేదు. వచ్చేసారి ఫ్రాంచైజీ పక్కన పెట్టేలోగా తానే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడం గౌరవంగా ఉంటుందని భావించాడు. రాయుడు ఇటీవల ఏపీ సీఎం జగన్ ను కలిసి క్రికెట్ అకాడమీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. అకాడమీ ఏర్పాటుకు స్థలం కోసమే జగన్ ను కలిశారన్న వాదనా ఉంది. సీఎం జగన్ ను ఎందుకు కలిశారో ఇటు పార్టీ వర్గాలుగానీ, అటు సీఎంవో గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ కు రిటైర్మెంట్ నిర్ణయంతో తన తదుపరి ఇన్నింగ్స్ రాజకీయాలేననే చర్చలు మొదలయ్యాయి.
రాజకీయాలపైనా ఇంట్రెస్ట్ ..
గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు హైదరాబాద్లో క్రికెటర్ కెరీర్ ప్రారంభించాడు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా సమయం కాదని భావించాడు. కెరీర్ కొనసాగుతున్న సమయంలో ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నా భవిష్యత్ దెబ్బతింటుంది అనే ఆలోచనతో మిన్నకుండిపోయాడు. అయితే తన స్వస్థలం గుంటూరు కావడంతో ఏపీ నుంచి రాజకీయ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పైగా జయదేవ్ నాన్ లోకల్. అయితే అంబటి ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. వైసీపీ వద్దనుకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించుకునేందుకు అంబటి రాయుడు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.