Pooja Hegde: పూజా హెగ్డే గురించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు చాలా వరకు హిట్లు సాధించాయి. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. వరుసగా ప్రేమకథా చిత్రాలతో కుర్రకారును కొల్లగొట్టారు. బుట్టబొమ్మగా ప్రేక్షకులకు చేరువయ్యారు. కెరీర్ మొదట్లోనే స్టార్ హీరోల సరసన ఆడిపాడిన పూజా.. ప్రస్తుతం సినిమాల ఎంపికపై ఆచీ తూచీ అడుగులు వేస్తుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా హెగ్డేకు సంబంధించిన ఆసక్తికర విషయాలు.
ఓడిన చోటే గెలిచి..!
1990, అక్టోబర్ 13న కర్ణాటకకు చెందిన విద్యావంతుల కుటుంబంలో పూజా జన్మించింది. పుట్టి పెరిగిందంతా ముంబైలోనే అయినా.. తల్లిదండ్రులది కర్ణాటక కావడంతో దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాలు ఆమెకు ఇష్టం. 19 సంవత్సరాల్లోనే మిస్ ఇండియా (2009) పోటీల్లో పాల్గొంది భామ. ఫస్ట్ రౌండ్ లోనే నిష్కృమించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఓటమిగా తీసుకోకుండా ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంది. 2010లో ‘మిస్ యూనివర్స్ ఇండియా’లో పాల్గొంది. రన్నరప్గా కిరీటం అందుకుంది. విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చాలా సందర్భాల్లో చెప్పింది పూజా.
అనుకోని..!
రంగుల ప్రపంచమైన సినిమాల్లోకి రావాలని పూజా హెగ్డే ఎప్పుడూ అనుకోలేదు. ‘మిస్ ఇండియాలో పాల్గొన్న తర్వాత మోడలింగ్ అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అప్పుడే మూవీస్ గురించి కొంచెం ఆలోచన వచ్చింది. ఆ సమయంలో తమిళంలో ‘ముగామూడీ’ చేశా. ఆ తర్వాత తెలుగులో ‘ఒక లైలా కోసం’లో అవకాశం వచ్చింది’ అని ఒక సందర్భంలో చెప్పింది పూజ. అనుకోకుండా వచ్చిన అవకాశంతో సినిమాల్లో సెటిల్ అయ్యానని.. కెరీర్ తొలినాళ్లలో స్టార్ హీరోల చిత్రాల్లో యాక్ట్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారామె.
ఒక్క సినిమా.. రెండేళ్లు బ్రేక్!
‘మొహంజదారో’తో బాలీవుడ్ లోకి వెళ్లింది. రెండేళ్ల సమయం ఈ ఒక్క సినిమా కోసమే కేటాయించింది పూజా. ‘రణ్బీర్తో ఒక యాడ్ చేశాను. ఆ యాడ్ చూసిన డైరెక్టర్ అశుతోష్ సతీమణి మొహంజదారోలో హీరోయిన్ గా ఈమె సరిగ్గా సరిపోతుందని భావించారు. నన్ను పిలిపించారు మొదట్లో కొంత టెన్షన్ పడ్డా.. సెలక్ట్ అయిన తర్వాత సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వారికి ఇచ్చిన మాట మేరకు ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇతర చిత్రాల్లో యాక్ట్ చేయలేదు. మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ అవకాశం ఇచ్చినా వదులుకున్నా’ అని చెప్పారు.
అమ్మే అన్నీ..!
‘నాకు అమ్మే స్ఫూర్తి. సినిమాల్లోకి వస్తాననప్పుడు ప్రోత్సహించింది. ఇతరులను గౌరవించు.. నీ పనిని నువ్వు చక్కగా చెయ్.. సక్సెస్ అదే వస్తుంది అని చెప్పింది’ అని పూజా తన తల్లి గురించి చెప్పింది. కెరీర్ ప్రారంభంలో తన నిర్ణయాలు ఫెయిల్ అయ్యాయని.. సినిమా ఫ్లాప్ అయితే బాధపడతానని.. ఒంటరిగా కూర్చొని ఏడుస్తానని పూజా చెప్పారు.
చూసే విధానరమే..!
కెరీర్ లో పూజా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. యాక్టింగ్ స్టైల్ను పలువురు కామెంట్స్ చేశారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. విమర్శలను నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అందులో కొన్ని వివరణాత్మక విమర్శలుంటాయన్నారు. వాటి నుంచి చాలా విషయాలు తెలుసుకొని ఆచరించవచ్చని తెలిపారు.
మళ్లీ స్పీడ్..!
2022లో పూజా నటించిన 4 తెలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటి తర్వాత ఆమె మళ్లీ తెలుగులో యాక్ట్ చేయలేదు. 2023లో ఒకే ఒక్క బాలీవుడ్ మూవీ ‘కిసీ కా భాయ్.. కిసీ కి జాన్’ విడుదలై అపజయం పాలైంది. దీంతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మూడు ప్రాజెక్టుల్లో పని చేస్తుంది. బాలీవుడ్లో ‘దేవ’ పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది. తమిళంలో సూర్య, విజయ్ చిత్రాల్లో నటిస్తున్నారు.