
Election Schemes : తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు నిన్న నిర్మల్ పర్యటనలోనే సుమారు రూ. 120 కోట్లు ఆ జిల్లా వాసులకు ప్రకటించారు.
అయితే ఈ ఐదు నెలల్లో సుమారు రూ. 40 వేల కోట్లు ప్రజలకు అందించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. పెండింగ్లో ఉన్న అన్ని నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ల తోపాటు రుణమాఫీ, రైతుబంధు ఇలా అన్ని రకాల సాయం చేయబోతున్నది. బీసీలకు రూ.లక్ష సాయం, గృహలక్ష్మి, దళిత బంధు ఇలా అన్ని పథకాలను ఆయా వర్గాలకు అందించబోతున్నది. పల్లెలకు, మున్సిపాలిటీలకు విరివిగా నిధులు కేటాయించబోతున్నది. మనబడి ద్వారా కూడా ప్రభుత్వ పాఠశాలను బాగు చేసే కార్యక్రమానికి వేగవంతం చేయబోతున్నది.
ఎన్నికల షెడ్యూలు రాకముందే ఇదంతా ఖర్చు చేయాలని భావిస్తున్నది. జూలై నుంచి సెప్టెంబర్ లోగా ఇదంతా ప్రజలకు చేర్చాలని ఏర్పాట్లు చేసుకున్నది. ముఖ్యంగా ఇందులో వానకాలం సీజన్ రైతుబంధుకు రూ. 7500 కోట్లు ఇవ్వబోతున్నది. దళిత బందుకు రూ.5000 కోట్లు, గృహలక్ష్మికి మూడు నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు చేయబోతున్నది.
ఎందుకు అవసరమైన నిధుల సేకరణపై కూడా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ ద్వారా కొంత వస్తుందని భావిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ భూములు లీజు, ఇతర మార్గాల ద్వారా అప్పులు తెచ్చి అటు ఉద్యోగులకు జీతాలతో పాటు ఇటు ప్రజలకు వరాలు కురిపించాలని భావిస్తున్నారట. మరి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ భారీ స్కెచ్ ని ప్లాన్ చేశారు. ఎన్నికల ముందు ఈ వరాలు ప్రజల్లో తమపై మరింత ఆదరణ ను పెంచుతాయని, హ్యాట్రిక్ కొట్టేందుకు ఇది తమ కు లాభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాలి.






