
లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు సైబరాబాద్ మాజీ కమీషనర్ , ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మీలాంటి స్టార్ లు ఆమ్వే వంటి మోసపూరిత కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్నాయని , మొత్తం వ్యవస్థే నాశనం అవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ఇలాంటి వాటికి ప్రచార కర్తలుగా ఉండొద్దని అభ్యర్ధించాడు సజ్జనార్.
పలువురు స్టార్ హీరోలు , స్టార్ హీరోయిన్ లు అలాగే క్రికెటర్లు ఇలా పాపులర్ సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా ప్రజలకు హాని కలిగించే సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో అలాంటి వాటికి ఎక్కువగా ప్రాచుర్యం లభిస్తోంది. దాంతో ఆ సంస్థలు ఆర్ధికంగా ఎదుగుతున్నాయి. ఆ లిస్ట్ లో ఇప్పుడు ఆమ్వే కూడా చేరింది.
అమితాబ్ బచ్చన్ పలు ప్రోడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు అందులో ఆమ్వే కూడా ఒకటి. ఆమ్వే పై గత ఏడాది ఈడీ కేసు నమోదు చేసింది. మల్టీలెవల్ మార్కెటింగ్ వల్ల పేద ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. పేద , మధ్య తరగతి ప్రజల ఆశలను అవకాశంగా చేసుకొని వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొడుతున్నారు. ఇలా ప్రతీ ఏటా కోట్లాది మంది వందల కోట్లను నష్టపోతున్నారు. దాంతో ఇలాంటి కంపెనీల పట్ల అమితాబ్ మాత్రమే కాదు మిగతా స్టార్ లు కూడా అప్రమత్తంగా ఉండాలని అభ్యర్ధిస్తున్నాడు సజ్జనార్.






