
కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. తానే ఈ సినిమాకు దర్శకత్వం వహించి, నటించాడు. ఊహించని విధంగా కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోను కాంతార దుమ్ముదులిపేసింది. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా.. దాదాపు 450 కోట్ల వరకు రాబట్టింది. ఈ సినిమా విజయంలో కంటెంట్తో పాటు మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బీజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ సినిమా కే ప్రాణంగా నిలిచింది వరాహ రూపం సాంగ్. అయితే ఈ పాట కాపీ రైట్ ఇష్యూ వల్ల కొన్నాళ్ల పాటు నడిచిన ఈ వివాదం క్లియర్ అయినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు అది మళ్లీ మొదటికొచ్చింది.
వరాహ రూపం సాంగ్ తమ ‘నవసర’కు కాపీ అని తైక్కుడం బ్రిడ్జ్ అనే మళయాళ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అంతేకాక లీగల్ యాక్షన్కు సిద్ధమై కోర్టు మెట్లు ఎక్కింది. వరాహ రూపం సాంగ్ను థియేటర్స్తో పాటు డిజిటల్ మాధ్యమాల్లో ఉపయోగించరాదంటూ నిషేధాన్ని విధించింది. తాజాగా ఈ కేసు విచారణ చేసిన కోర్టు కాంతార మేకర్స్కు షాక్ ఇచ్చింది. థియేటర్స్, ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఎక్కడా యూజ్ చేయొద్దని ఆదేశించింది.అంతేకాక ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మే 4లోగా అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అయితే గతంలో సినిమా నుంచి పాటను తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చిన విషయం విదితమే. అయితే వరహారూపం ఇష్యూ కాస్త మళ్లీ మొదటికొచ్చింది.
ప్రస్తుతం కాంతార మేకర్స్ ఈ సినిమాకు ప్రీమేక్ వెర్షన్గా కాంతార 2ను రూపొందించే పనిలో ఉన్నారు. రిషబ్ శెట్టి అండ్ టీమ్ రైటింగ్ వర్క్పై పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది జూన్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రకటించారు. దీనికోసం పలు ప్రాంతాలను కూడా అన్వేషించినట్లు సమాచారం. అయితే పార్ట్ 2 లో రిషబ్ తండ్రి అడవిలోని ఓ ప్రాంతంలో ఎందుకు మాయమైపోయారన్న విషయాన్ని చూపిస్తారని ప్రచారం మొదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో రిషబ్ శెట్టి మరింత విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ లేదా మేలో కాంతారా 2 మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రజినీకాంత్ నటిస్తారనే టాక్ కూడా రీసెంట్గా చక్కర్లు కొడుతున్న టైంలో… పాట వివాదం రాజుకుంది.






