సేవా కార్యక్రమాలు చేయడానికి, ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందుంటారు. టాలీవుడ్ ఇండస్ర్టీలో, అభిమానులు కుటుంబాలకు ఎవరికి ఏ ఆపద వచ్చిన సహకరించడానికి ఆయన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది.అలాంటి మెగాస్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న మొగిలయ్య చికిత్సకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించాడు. బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య గత 30 సంవత్సరాలుగా డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయనకు రెండు కిడ్నీలు పాడవడంతో ఏడాది కాలం నుంచి రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా గుండెపోటు రావడంతో మొగిలయ్య ఫ్యామిలీ ఆందోళన చెందారు.
మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండటంతో ముందుగా వరంగల్ లో, తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి నిమ్స్ లో రక్త పరీక్షలు చేయించి కొంత కుదుట పడేలా చేశారు. అయితే కంటి చూపు మందగించింది. పైగా మొగిలయ్య ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. సామాజిక వర్గం పరంగా కూడా అండగా నిలిచే పరిస్థితి లేదు. బలగం మూవీ నటులు చేదోడు వాదోడుగా ఉన్నారు. మొగిలయ్య దీన పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆయన కంటిచూపు చికిత్సకు ఆర్థిక సాయం చేస్తానని … ఎంత ఖర్చయినా సరే తనే భరిస్తానని చిరు తెలిపారట. బలగం దర్శకుడు వేణుకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. అతనికి అండగా ఉంటానని.. కంటి చూపు చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇక చిరంజీవి సంపాదించిన డబ్బులో సింహభాగం అవసరంలో ఉన్నవారికి ఖర్చు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి వాటితో అనేక సేవలు చేస్తున్న ఆయన కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు పెద్దన్నగా నిలుస్తున్నాడు. ఏ ఇబ్బందులు ఉన్న అన్నయ్యగా భరోసా ఇస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మందికి ఆర్థికసాయం చేసిన చిరంజీవి ఇప్పుడు మొగిలయ్య కోసం సాయం చేయడానికి ముందుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ విషయం మొగిలయ్య కుటుంబసభ్యులు ఓ ఇంటర్వ్యూలో చెప్పగా చిరు చేస్తున్న సాయం బయటకు వచ్చింది. ఇంత సాయం చేసి కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా పబ్లిసిటీ చేసుకోలేదని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అంతేకాక దటీజ్ మెగాస్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు.