నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం విడుదల కాకుండా నేను అడ్డుపడ్డానని , అలాగే ఈ సినిమాకు సరైన థియేటర్లు ఇవ్వకుండా తొక్కేశానని రకరకాల పుకార్లు సృష్టిస్తున్నారు. అలాగే మీడియాలో రాస్తున్నారు అది మంచి పద్దతి కాదు …….. ముందు అసలు విషయం తెలుసుకోండి అంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు అగ్ర నిర్మాత దిల్ రాజు.
నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 చిత్రం విడుదల విషయంలో రకరకాల సమస్యలు ఎదుర్కొంది. చివరకు ఆగస్టు 12 అని డేట్ ఫిక్స్ చేసుకుంటే గిల్డ్ లో ఉన్న నిర్మాతల సూచనతో ఆగస్టు 13 కు మారింది. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఆగస్టు 12 న విడుదలైన నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ప్లాప్ అయ్యింది. ఆగస్టు 13 న విడుదలైన కార్తికేయ 2 సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
దాంతో దిల్ రాజు పై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చి పడుతున్నాయి. దాంతో నిన్న జరిగిన కార్తికేయ 2 సక్సెస్ మీట్ కు దిల్ రాజు కూడా హాజరయ్యాడు. నేను కార్తికేయ 2 చిత్రాన్ని తొక్కేయాలని చూసినట్లుగా మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది సరైన పద్దతి కాదు. కావాలంటే వన్ టు వన్ డిబేట్ పెట్టండి వివరంగా చెబుతాను అంతేకాని నేను సినిమా తొక్కేయడం ఏంటి ? సినిమా అంటే నాకు ప్రాణం అంటూ వివరణ ఇచ్చాడు దిల్ రాజు. అయితే కార్తికేయ 2 చిత్రాన్ని మాత్రం సకాలంలో విడుదల కాకుండా అడ్డుకుంది గిల్డ్ అనేది నిజం. ఆ గిల్డ్ లో దిల్ రాజు కూడా కీలకమైన వ్యక్తి మరి. దాంతో ఇలా దిల్ రాజుపై విమర్శలు వెల్లువెత్తాయి.