నాటి తరం హీరోగా.. నేటి తరానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుపరిచితులైన సీనియర్ నటుడు శరత్ బాబు అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను తెలంగాణకు తరలించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మూడు వారాల కిందట అస్వస్థతకు గురైన శరత్ బాబు బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి మెరుగు కాకపోవడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి గురువారం తరలించారు. అతడికి కావాల్సిన వైద్య పరీక్షలతో పాటు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యం మెరుగవుతోందని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. కాగా శరత్ బాబు అనారోగ్యం విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమకుచెందిన వారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
తెలుగులో శరత్ బాబు చివరి సినిమా పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ . ఆయన 1973లో ‘రామరాజ్యం’ సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. అనంతరం వరుస చిత్రాలు చేస్తూ ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణలకు సమాన స్థాయిలో గుర్తింపు పొందారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో శరత్ బాబు నటించారు. అప్పట్లో కథ నాయకుడిగా నటించిన శరత్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నట జీవితం మొదలుపెట్టారు. దాదాపు ఆయన 250కి పైగా సినిమాల్లో నటించారు.