
సినిమా స్టార్ లకు షాక్ ఇచ్చింది ట్విట్టర్. ఇంతకుముందు పలువురు సినీ ప్రముఖులకు ట్విట్టర్ ఎకౌంట్ లలో వాళ్ళ హోదాను గుర్తిస్తూ బ్లూ టిక్ ఉండేది. ఇది వాళ్లకు గౌరవసూచకంగా ఇవ్వబడింది. అయితే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత రకరకాల నియమ నిబంధనలు పెడుతూ తుగ్లక్ ను తలపిస్తునాడు.
బ్లూ టిక్ కావాలంటే తప్పకుండా ట్విట్టర్ కు సొమ్ములు చెల్లించాల్సిందే అని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు మస్క్. అయితే ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడేమో అనుకున్నారు. కానీ తాజాగా బ్లూ టిక్ కలిగిన సినిమా తారలు ట్విట్టర్ కు డబ్బులు చెల్లించకపోవడంతో వాళ్లందరికీ బ్లూ టిక్ తీసిపడేసాడు ఎలాన్ మస్క్. దాంతో షాకవ్వడం నెటిజన్ల వంతు అయ్యింది. అంతేకాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ నిర్ణయం పట్ల షాక్ అవుతున్నారు.
బ్లూ టిక్ కోల్పోయిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ , మోహన్ బాబు , రాంచరణ్ , వెంకటేష్ , అల్లు అర్జున్ , ప్రకాష్ రాజ్ , అక్కినేని అఖిల్ , అక్కినేని నాగచైతన్య , కీర్తి సురేష్ , పూజా హెగ్డే , నితిన్ , సమంత , రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ , మంచు మనోజ్ తదితరులు ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు , నాగార్జున , మంచు విష్ణు తదితరులకు మాత్రం బ్లూ టిక్ ఉంది దాంతో వాళ్ళు బహుశా ట్విట్టర్ కు డబ్బులు కట్టి ఉండొచ్చు.
ట్విట్టర్ లో బ్లూ టిక్ కావాలంటే నెలకు 650 వెబ్ డెస్క్ కు యాప్ కోసమైతే 900 చెల్లించాలి. ఇక మిగతా భాషా హీరోల విషయానికి వస్తే …… రజనీకాంత్ , షారుఖ్ ఖాన్ , దీపికా పదుకోన్ , అమితాబ్ బచ్చన్ , సల్మాన్ ఖాన్ , అలియా భట్ , విజయ్ , శింబు , ప్రియాంకా చోప్రా సైతం బ్లూ టిక్ కోల్పోయారు.






