నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రం దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. దాంతో హిందూపురంలో ఏప్రిల్ 23 న అశేష అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరసింహారెడ్డి శతదినోత్సవ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2023 జనవరి 12 న బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే.
బాలయ్య ద్విపాత్రాభినయం పోషించగా హానీ రోజ్ , శృతి హాసన్ లు హీరోయిన్ లుగా నటించారు. దునియా విజయ్ , వరలక్ష్మీ శరత్ కుమార్ , మురళీ శర్మ విలన్లుగా నటించారు. ఇక తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.
జనవరి 12 న విడుదలైన వీరసింహా రెడ్డి వీరవిహారం చేసింది. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఏప్రిల్ 20 తో వీరసింహా రెడ్డి చిత్రం 100 రోజులను పూర్తి చేసుకుంటోంది. దాంతో బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వీరసింహారెడ్డి శతదినోత్సవ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలలో బాలయ్య తో పాటుగా దర్శకుడు గోపిచంద్ మలినేని , మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, అలాగే బాలయ్య అభిమానులు పాల్గొననున్నారు.