Ponguleti : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. ఈనెల 28న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తన అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకునే అవకాశం ఉంది. ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు 10 నియోజకవర్గాల పరిధిలోని తన ముఖ్య అనుచరులతో భేటి కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత ఆయన అనుచరణం పొంగులేటిని కాంగ్రెస్ లో చేరాలని సూచిస్తున్నారు. అంతకుముందు పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలోనూ ఆ పార్టీ జోష్ మీద ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీతో పొంగులేటి సమావేశమై తన డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. కాంగ్రెస్ నుంచి సానుకూల వైఖరి రావడంతో ఆయన ఆపార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. నేడు అనుచరులతో సమావేశం నిర్వహించి ఆయన నిర్ణయం తీసుకుకోనున్నారు. ఈనెల 12న ఆయన కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం కన్పిస్తోంది.