JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఈరోజు కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీయేనని, మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్ రావు గెలుపు ఖాయమన్నారు.
కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసిందని, తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో రాజ్యయమేలిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కూడా చూస్తున్నామన్నారు. ఇండియా కూటమిని ఆయా పార్టీల వారసుల కోసమే ఏర్పాటు చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలులో ఉన్నారని అన్నారు.