Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాగైనా సత్తా చాటాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీస కార్యదర్శిరోహిత్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ ను జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో అమిత్ రెడ్డి కలిశారు.
బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు వీడ్కోలు పలుకగా.. తాజాగా మరో యువనేత గుత్తా అమిత్ రెడ్డి పార్టీని వీడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన తాత గుత్తా వెంకట్ రెడ్డి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అమిత్.. గత కొంత కాలంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టు సాధించారు.