Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్ లో కాంగ్రెస్ మీడియా కమిటీ ఇన్ చార్జి సామ రాంమోహన్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రెట్టింపు ధాన్యాన్ని కొన్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు భరోసా నిధుల పంపిణీని నిలిపి వేయించాయని ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజీ 2019లోనే దెబ్బతిన్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో తెలిపిందని అన్నారు. ఆ సమయంలోనే నీళ్లు వదిలి మరమ్మతులు చేయాల్సిందని నివేదికలో పేర్కొన్నారని, ఇప్పుడు ఏ బ్యారేజీలోనూ నీళ్లు నిల్వ చేయకుండా వదిలేయాలని కమిటీ నిపుణుల చెప్పారని మంత్రి ఉత్తమ్ వివరించారు. దేశంలో ఇండియా కూటి అధికారంలోకి వస్తుందని, బీజేపీకి దేశవ్యాప్తంగా 200 సీట్లు కూడా రావన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తాయని, ఇండియాలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ నియోజకవర్గంలో వస్తుందని, జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.