Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. నిన్న (మంగళవారం) తిరుపతిలో జరిగే వారాహి విజయభేరి యాత్రలో పాల్గొనడానికి పవన్ రేణిగుంట విమాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం లోపలి నుంచి బయటకు వచ్చే సమయంలో పవన్ కుడికాలు బొటన వేలుకి కట్టు కనిపించింది. అలాగే కారు వద్దకు వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ చాలా నెమ్మదిగా నడిచారు. దీంతో పవన్ కాలికి కట్టుతో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో గాయం నుంచి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభవిమానులు కోరుకుంటున్నారు.
అయితే, అసలు పవన్ కాలికి ఏమైందనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఈ విషయమై జనసేన పార్టీ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మరోపక్క పవన్ కు మద్దతుగా టాలీవుడ్ కదిలివస్తోంది. ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత హీరోలు నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జ వంటి వారు జనసేనకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కోరారు.