Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర, వడ్డీ వ్యాపారి నివాసంలో ఇన్ కం టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రూ. 25 కోట్ల నగదు, ఇతర విలువైన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు అధికార పార్టీకి చెందిన వ్యక్తిదని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ నాయకుడు దారా శ్రీనివాసరావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన రూ.31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు 18వ వార్డు వైసీపీ కౌన్సిలర్ నీలిమ భర్త శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ప్రకాశ్ బాబు తెలిపారు.