Kurnool Hospital : కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సిబ్బంది నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు ఒక రోజంతా గదిలో బంధీ అయ్యాడు.
ఆ పిల్లాడి వయస్సు ఐదేళ్లు. అతనికి వినపడదు.. మాట్లాడలేడు. చికిత్స అందించేందుకు తల్లిదండ్రులు కర్నూలు సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా వార్డులో ఉంటున్నాడు. పిల్లాడు ఆదివారం ఆడుకుంటూ అనస్థీషియా విభాగాదిపతి గదిలోకి వెళ్లాడు. మరో వైపు పారి శుద్ధ్య సిబ్బంది గదిని శుభ్రం చేసిన తర్వాత పిల్లాడిని గమనించకుండా తాళం వేసి వెళ్లిపోయారు. ఎవరూ లేకపోవడంతో బాలుడు భయ పడిపోయాడు.
అరుద్దామంటే మాట రాదు. ఎలాంటి శబ్దం వినపడదు. రోజంతా ఆహారం లేక అల్లాడి పోయాడు. గదిలో ఫ్రిజ్లో ఉన్న నీటిని తాగుతూ రోజంతా గడిపాడు. ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. సిబ్బంది సోమవారం గది తలుపులు తెరవగా బాలుడు కనపడటంతో అందరూ ఆశ్చర్య పోయారు.
ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లె గ్రామానికిచెందిన ఉసేనయ్య, మౌనిక దంపతుల కుమారుడు సుజిత్ (5)కు పుట్టుకతో మూగ, చెవుడు. ఈ నేపథ్యంలో కాంకర్ ఇన్స్టాంటేషన్ ఆపరేషన్ కోసం 20 రోజుల కిందట కర్నూలు సర్వజన ఆస్పత్రిలోని ఈఎన్టీ వార్డులో చేర్పించారు.
ఈ క్రమంలో శనివారం అనస్థీషియా విభాగాధిపతి కి పిల్లాడిని తల్లిదండ్రులు తీసుకెళ్లి చూపించి తీసుకెళ్లారు. ఈఎన్టీ వార్డులో ఆదివారం ఉండగా వైద్య సిబ్బంది మందులు రాసివ్వడంతో వాటిని తీసుకొచ్చేందుకు తల్లి మౌనిక బయటకు వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న అనస్థీషియా విభాగాధిపతి గదిలోకి వెళ్లాడు. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది హెచ్ ఓడీ గదిని శుభ్రం చేసి బాలుడిని గమనించకుం డా తాళం వేసి వెళ్లిపోయారు.
మందులు తీసుకొచ్చిన తల్లి బెడ్డుపై తన కుమారుడు కనపడకపోవడంతో అన్నిచోట్లా వెదికారు. చివరికి ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అప్రమత్తమై పలు గ్రూపుల్లో సమాచారం పెట్టారు. అయినా పిల్లాడి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం అనస్థీషియా విభాగాధిపతి గది తలుపులు తెరవగా పిల్లాడు కన పడటంతో అందరూ అవాక్కయ్యారు.
తమ కుమారుడు కనపడటంతో తల్లి దండ్రులు ఆనందంలో మునిగిపోయారు. పిల్లాడు ఒక రోజంతా గదిలో ఉండి ఫ్రిజ్లో ఉన్న నీటిని తాగి అలాగే ఉండిపోయాడు. వార్డు సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను ఎప్పటికప్పుడు గమనించాల్సి ఉండగా పట్టించుకోకపోవడం దారుణ మని పలువురు పేర్కొన్నారు.