Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు. ఈ నేలపై పుట్టి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వారిలో అగ్రగణ్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు. తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య. దక్షిణాదిలో భజన సంప్రదాయానికి, పదకవితా శైలికి ఆద్యుడు కావడంతో ఆయనకు పదకవితా పితామహడు అనే బిరుదు వచ్చింది. తిరుమల శ్రీనివాసుడిని సేవించిన అన్నమయ్య ఆయనను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య కీర్తనలు ఇప్పటికీ ఆధ్యాత్మిక తన్మయత్వంలో ముంచెత్తుతూనే ఉన్నాయి.
అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతిలో ఓ భాగమైపోయాయి. జనాల నోళ్లలో నాటుకుని పోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా అనేకరకాలైన శైలిలో పాటలు రాశాడు అన్నమాచార్యుడు. ఆయన కీర్తనలను ఇప్పటికీ తెలుగు ప్రజలు నిత్యం పాడుకుంటూనే ఉన్నారు. తెలుగు గడ్డపైనే కాదు విదేశాల్లో సైతం అన్నమయ్య కీర్తనలు అలరిస్తూనే ఉన్నాయి.
ప్రపంచ రికార్డులకు పేరుగాంచిన ప్రముఖ తెలుగు సంస్థ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 31వ తేదీన 7 వేల మందితో డల్లాస్ లో మహా బృంద గళార్చన పేరిట సంకీర్తనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. అలెన్ ఈవెంట్ సెంటర్ లో 7వేల మంది అన్నమాచార్య రచించిన ఏడు సప్తగిరి సంకీర్తనలను ఆలపించి అన్నమయ్యకు ఘన నివాళి అర్పిస్తారని ఆయన చెప్పారు.