YS Sharmila : తాను అడిగిన ప్రశ్నలకు జగనన్న సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. కడపలో విలేకరులతో మాట్లాడిన ఆమె కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారని, నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా..? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా..? అని ప్రశ్నించారు.
‘‘ఆనాడు ప్రతి సభలో, ప్రతి అడుగులో జగన్ కోసం కాలికి బలపం కట్టుకొని నేను తిరగలేదా..? ఇన్ని త్యాగాలు చేసినా నాకు రాజకీయ కాంక్ష ఉందంటున్నారే.. అదే ఉంటే నేను పొందాలనుకున్న పదవి మీ పార్టీలో మొండిగానైనా పొందగలను. వివేకానందరెడ్డి లాంటి వారు నాకు అండగా నిలబడ్డారు. నన్ను ఎంపీగా చేయాలని ప్రయత్నించిన ఎంతో మంది మీ పార్టీలోనే ఉన్నారు. నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్షగానీ, మిమ్మల్ని పదవి అడగకుండా మీ కోసం నిస్వార్థంగా పనిచేశానని నేను ప్రమాణం చేయగలను. మిమ్మల్ని పదవి అడిగానని మీరు అదే బైబిల్ పై ప్రమాణం చేయగలరా..? అంటూ షర్మిల కన్నీరు పెట్టుకున్నారు.