AP Alliance : తెలంగాణలో భంగపడిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పుంజుకోవాలని అనుకుంటోంది. దీని కోసం అన్ని దారులు వెతుకుతోంది. గతంలో తెలుగుదేశం అంటే పడని బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంతో కలిసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జనసేన టీడీపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది. ఇప్పుడు వీరికి బీజేపీ కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే సమస్య అస్సలు తలెత్తదు.
అయితే, ఎన్నికలకు ముందే దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలని బీజేపీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పార్టీలోనే అభిప్రాయాలు సేకరించారు. మెజార్టీ నేతలు టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని అధిష్టానానికి సూచించారు. ఈ కూటమిపై చర్చలు జరిపేందుకు ముగ్గురు జాతీయ నేతలను నియమించామని, దాని లాభ నష్టాలను వివరిస్తూ ఒక నివేదికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశామన్నారు.
బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య చర్చలు తమ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యానికి కారణమయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఒప్పందంలో భాగంగా 12 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాలు కావాలని బీజేపీ కోరనుందని సమాచారం. బీజేపీకి అన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ, జనసేన అంగీకరించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలో మోడీ హవా ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించుకుంటే తమకే కలిసి వస్తుందని టీడీపీ కూడా అనుకుంటున్నదని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.