AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్ సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు మద్యం కావడంతో ఏరులై పారుతోంది. లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. మద్యం తాగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అవయవాలు పనిచేయక ఆస్పత్రుల్లో మూలుగుతున్నారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు సర్కారు తలుచుకుంటే మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లడం మామూలే. అలా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఎటు చూసినా మద్యం షాపులే దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్యుడు జేబు గుల్ల అవుతోంది. ఆరోగ్యం కాస్త హరీ మంటోంది. ఈ పరిస్థితుల్లో మద్యం పాలసీ సర్కారుకు మంచి ఆదాయ వనరుగా మారడం సహజమే.
ఏపీలో మద్యం ట్రాన్స్ పోర్టు ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోంది. ఐదేళ్లలో లక్షన్నర కోట్ల వ్యాపారం సాగిందంటే మద్యంలో ఎంత లాభం ఉందో తెలుస్తోంది. ఇంకా మద్యం బ్లాక్ లో విక్రయిస్తూ వైసీపీ నేతలు రూ.కోట్లు దండుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముకుంటున్నారు. దీంతో కూడా లాభాలు గడిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో మద్యం వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది.
పొద్దంతా పని చేసి ఏదో ఉపశమనం కోసం మందు తాగే అలవాటు ఉన్న వారిని నిలువునా దోపిడీ చేస్తున్నారు. కాయకష్టం చేసుకుని బతికే వారి జేబులు గుల్ల చేస్తున్నారు. కాస్త మందు తాగి ఒళ్లు నొప్పులు మరిచిపోదామనుకునే వారికి కొత్త నొప్పులు వచ్చేలా చేస్తోంది. మద్యం వినియోగం రాష్ట్రంలో ఇలా బ్లాకులో కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
సొంత మద్యం అమ్ముకుంటూ ప్రజల రక్తం పీలుస్తున్నారు. మద్యం దుకాణాల వల్ల కుటుంబాలు చెల్లా చెదురైపోతున్నాయి. పేదల బతుకులు చిద్రం చేస్తున్న మద్యం రక్కసిని రూపుమాపాలని ప్రజలు ఎంత మొత్తుకుంటున్నా సర్కారు పెడచెవిన పెడుతోంది. ఇలాంటి పాలకులకు ఓటేసే ముందు ఓ సారి ఆలోచించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.