Telangana : తెలంగాణలో కామ్రెడ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బీఆర్ఎస్ గెంటి వేయడంతో ఎటు వెళ్లాలో తెలియక ఎర్ర సోదరులు మెల్ల మెల్లగా కాంగ్రెస్ ను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న కామ్రెడ్లు ఆ తర్వాత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమయ్యారు. ప్రజా సమస్యలను గాలికి వదిలారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడితే అక్కడ సీపీఐ, సీపీఎం నాయకులు వారికి అండగా నిలిచేవారు.
ప్రత్యేక ఉద్యమం, తెలంగాణ ఆవిర్భావం, టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు దీరడం జరిగిపోయాయి. ఇందులో ఉద్యయం, ఆవిర్భావం సమయంలో మాత్రమే యాక్టివ్ గా ఉన్న కామ్రెడ్లు ప్రజలకు మాత్రం చేరువకాలేకపోయారు. మునుగోడు ఎన్నికల సమయంలో కామ్రెడ్లతో పొత్తు ఉంటుందన్న సీఎం చంద్రశేఖర్ రావు వారితో సంబంధం లేకుండానే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. ఇందులో అదే పార్టీకి సంబంధించిన స్థానాలు పెండింగ్ లో పెట్టాడు తప్పించి సీట్ల సర్ధుబాటు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు.
దీంతో తేరుకున్న కామ్రెడ్లు కేసీఆర్ మోసం చేశాడని లబోదిబోమంటూ సమావేశాలు, నాయకులు, ప్రముఖుల అభిప్రాయాల సేకరణ చేపట్టారు. ఇక ఈ సారి కాంగ్రెస్ తో కలిసి నడవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే I.N.D.I.A (ఇండియా) కూటమిలో ఉన్నామన్న నాయకులు తెలంగాణలో కాంగ్రెస్ హస్తం కోసం చేయి చాస్తున్నారు. ఇందులో భాగంగా సీపీఎం, సీపీఐ రెండు పార్టీలు కాంగ్రెస్ నాయకులతో మంతనాలు కొనసాగిస్తున్నాయి. సీట్ల సర్ధుబాటు ఒక కొలిక్కి వచ్చేలా ఉండడంతో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా తరుఫున పోటీ చేస్తామని చెప్తున్నారు.