Seattle Police Officer : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి జాహ్నవి మృతి చెందింది. ఈ కేసు విషయంలో అక్కడి పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు తీవ్రర విమర్శకు దారి తీసింది. దీంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం కూడా మండిపడింది. దీంతో ఆయనను పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సియాటెల్ పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ రోజు అతను అలా మాట్లాడింది జాహ్నవిని చూసి కాదని సదరు పోలీస్ ఆఫీసర్ డేనియల్ అడెరెర్ విచారణ భాగంగా చెప్పారు. ఇక ఆ పోలీస్ అధికారికి సియాటెల్ పోలీస్ విభాగం మద్దతుగా నిలిచింది.
సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‘వైరల్ అయిన దృశ్యాలు బాడీ క్యామ్ వీడియో రికార్డ్ చేసినవి. ఆ సంభాషణల్లో ఒక వైపు మాత్రమే బయటికి వచ్చాయి. ఇందులో మరిన్ని వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. ఇలా సగం సగం తెలియడంతో అక్కడ ఏం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’ అంటూ గిల్డ్ పేర్కొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ రాసిన లేఖను గిల్డ్ విడుదల చేసింది.
న్యాయ వాదులను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు సదరు పోలీస్ ఆఫీసర్ తను ఇచ్చిన లేఖలో పేర్కొన్నాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోర్టులో వాదనలు ఎలా ఉంటాయో? ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో? గుర్తచ్చి నవ్వినట్లు తెలిపారు. ‘పెట్రోలింగ్ వాహనం కారణంగా ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా కో పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పాను. అప్పటికే నా డ్యూటీ ముగిసింది. బాడీ క్యామ్ ఆన్లో ఉన్న విషయం తెలియదు. నా వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్ అయ్యింది. అందులో నేను కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే మాట్లాడాను. ఇలాంటి ఘటనల్లో ఇరు వైపులా న్యాయవాదులు జరిపే వాదనలు ఎలా ఉంటాయో చాలా సార్లు చూశాను. అవి గుర్తుకు వచ్చే నవ్వుకున్నా’ అని డేనియల్ వివరించారు.
అంతేకానీ, బాధితులిని అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. దీనిపై విచారణ పారదర్శకంగా జరిపి ఎలాంటి శిక్ష విధించినా తనకు సమ్మతమే అంటూ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ఇది ఇలా ఉండగా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ అమెరికాలో ఆన్లైన్ పిటిషన్లు వస్తున్నాయి.