Hindu Population : భారత దేశంలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. 1950 నుంచి 2015 వరకు దేశంలో హిందువుల జనాభా వాటా 7.81 శాతం తగ్గినట్లు ఈఏసీ-పీఎం నివేదికలో వెల్లడించింది. దేశంలో హిందువుల జనాభా తగ్గిపోగా బౌద్ధులు, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులతో సహా మైనారిటీల జనాభా పెరిగింది. పార్సీలు, జైనుల జనాభాలో మాత్రం తగ్గుదల కనిపించింది. ఇతర పొరుగు దేశాలలో మెజారిటీ మతస్తుల జనాభా పెరుగుదల ఉండగా భారత్ లో మాత్రం భిన్నంగా ఉండడం గమనార్హం. 1950లో భారత జనాభాలో హిందువుల వాటా 84.68 శాతవ ఉండగా 2015 నాటికి అది 78.06 శాతానికి తగ్గింది. ముస్లింల జనాభా మాత్రం 1950లో 9.84 శాతం ఉండగా 2015 నాటికి అది 14.09 శాతానికి చేరుకున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
హిందువుల జనాభా పొరుగు దేశమైన మయన్మార్ లో 10 శాతం తగ్గగా, నేపాల్ లో అధిక సంఖ్యాక మతమైన హిందూ జనాభాలో 3.6 శాతం తగ్గుదల ఉందని నివేదిక తెలిపింది. 2024 మే నెలలో విడుదలైన ఈ నివేదిక 167 దేశాలలో జనాభా సరళిని అధ్యయనం చేసింది. భారత్ లో మైనారిటీలకు రక్షణ లభించడమే గాక వారు వృద్ధి చెందుతున్నారనడానకి ఈ లెక్కలే నిదర్శనమని నివేదిక పేర్కొంది.
సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయని సలహా మండలి అభిప్రాయపడింది. విధాన పరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియల ఫలితంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయని నివేదిక తెలిపింది.