Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వడగాలులు వీయడంతో పాటు భగ్గుమంటున్న ఎండలతో నిన్న వడదెబ్బకు గురై ఐదుగురు మృతి చెందారు. ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన జిల్లాల్లో వృద్ధులు, చిన్నారులు, రోగులకు ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరించారు.
నిన్న అత్యధికంగా నిజామాబాద్ లో 43.8 డిగ్రీలు, ఖమ్మంలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని అంటున్నారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి తాగడం మంచిదని సూచిస్తున్నారు. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.