Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో మే 4వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ మేరకు సూచించింది. రాష్ట్రంలోని హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో బుధవారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ పట్టణానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ స్గేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయని తెలిపింది. నల్గొండ జిల్లాలో 45.5 డిగ్రీలు, ములుగులో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.