Bandi Sanjay :
ఇటీవల అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. దీంతోపాటు ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా తీసుకుంది. ఈ మేరకు శనివారం రాత్రి బీజేపీ జాతీయ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది.
ఇటీవల బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన అధిష్టానం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే అప్పుడే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి లేదా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరిగింది. ఇక బండి సంజయ్ ని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక బండి సంజయ్ కి కేంద్రమంత్రి పదవి లేనట్లేనని అర్థమవుతున్నది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అయితే ఇటీవల మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు తెలంగాణకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి బీజేపీ అధిష్టానం తీసుకుంది. తాజాగా బండి సంజయ్, సోము వీర్రాజు తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పదిమందికి అవకాశం కల్పించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం నెలకొంది. తాజాగా వరంగల్ లో ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే బండి సంజయ్ ని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటూ ప్రకటన వెలువరించింది. బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడిగా అయ్యాకనే బీజేపీ బలోపేతమైనట్లు అధిష్టానం గుర్తించినా పలు సమీకరణాలవల్ల ఆయనను తొలగించాల్సి వచ్చిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.