Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆర్థిక సమస్యల కారణంగా మానసికంగా కుంగిపోయిన వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, తల్లిని హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ పట్టణం పటమట వాసవీనగర్ కు చెందిన ధరావత్ శ్రీనివాస్ (40) ఆర్తో సర్జన్. ఆయన భార్య ఉష (38), కుమార్తె శైలజ (9), కుమారుడు శ్రీహన్ (5), తల్లి రమణమ్మ (65) తో పాటు నివసిస్తున్నారు. ఏడాది క్రితం శ్రీనివాస్ శ్రీజ హాస్పిటల్ ను ప్రారంభించారు. అయితే ఆస్పత్రి సరిగా నడవక పోవడంతో రెండు నెలల క్రితం వేరేవారికి ఆస్పత్రిని అప్పగించారు. కాగా.. చెట్టకు ఉరి వేసుకొని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోగా, నలుగురు కుటుంబ సభ్యుల గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నలుగురిని హత్యచేసి శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక వీళ్లందరినీ ఎవరైనా హత్య చేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.