Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్ (ఈసీ). ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా 60 నుంచి 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో మత్రమే సీసీ కెమెరాలు పెట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేశారు.
అయితే, ఈ సారి దాదాపు ఆ సంఖ్యను మరింతగా పెంచనున్నారు. ఎంతంటే దాదాపు అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను పెట్టేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మే 8 నాటికి అన్ని కేంద్రాల్లో కెమెరాలు పెట్టడం పూర్తవుతుందని భావిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో వెబ్ కాస్టింగ్ లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు వెంటనే కంట్రోల్ రూమ్ లో టెక్నికల్ టీంను ఏర్పాటు చేయనున్నారు.
పోలింగ్ కు రెండు రోజుల ముందు అంటే మే 11, 12 తేదీల్లో డ్రై రన్ నిర్వహించి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తారు. ఉదయం 5 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఈవీఎంల సీలింగ్ పూర్తయ్యే వరకు వెబ్ కాస్టింగ్ కెమెరాలు పని చేస్తూనే ఉంటాయి. పోలింగ్ రోజున పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సర్వీస్ ఓటర్లు 65,707 మంది ఉన్నారు. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలు, ఒక్కొక్కటి 1,500 మంది ఓటర్లు, 224 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 శాతం కవరేజీతో 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టేబుళ్లు, విద్యుత్, తాగు నీరు, ర్యాంపులు, మరుగుదొడ్లు సహా అవసరమైన సౌకర్యాలు ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఎండ వేడిమి నుంచి ప్రజలను రక్షించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్లు చేయాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి బయటి జోక్యం లేకుండా పోలింగ్ ప్రక్రియ జరిగేలా చూస్తామన్నారు.