Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎన్నికలకు మరో 13 రోజులే ఉండడంతో పార్టీల అధినేతలు ప్రచారం బిజీ అయిపోయారు. రాబోయే రోజులు అన్ని పార్టీలకు కీలకం కావడంతో ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలను రచిస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రచారం చేయిస్తోంది. ఇక జగన్ గత ఐదేళ్లుగా చేసిన పాపాలను ప్రజల ముందు టీడీపీ, జనసేన ఉంచుతున్నాయి. ఇటీవలే జగన్ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. దీనిపై ప్రజల్లో పెద్దగా సానుకూలత రాలేదు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది.
ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. చంద్రబాబు, పవన్ తో పాటు బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి సిద్ధార్థ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే టీడీపీ తన సూపర్ సిక్స్ హామీలను ఇచ్చింది. జనసేన షణ్ముఖ వ్యూహం పేరుతో హామీలు ఇచ్చింది. అయితే మూడు పార్టీల ఉమ్మడి హామీలతో మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు.
కూటమి హామీల్లో ముఖ్యాంశాలు ఇవి..
– మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
– దీపం పథకం కింద ప్రతీ ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.
– ఆడబిడ్డ నిధి కింద 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వరకూ ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు.
– నిరుద్యోగ యువతకు నెలు రూ.3 వేల చొప్పున భృతి.
– యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
– ప్రతీ ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
-‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
– రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.
– ఆక్వా రైతులకు రూ.1.50లకే యూనిట్ విద్యుత్.
– పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి జాగా ఇస్తాం.
-ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం.
-ఇసుక ఉచితం.
– రాజధానిగా అమరావతి కొనసాగింపు.
– భూ హక్కు చట్టం రద్దు.
– వృద్ధాప్య పింఛన్ నెలకు రూ.4వేలు, పెంచిన పింఛన్ ఏప్రిల్ -2024 నుంచి అమలు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్.
-బీసీలకు 50 ఏళ్లకు నెలకు రూ.4 వేల పింఛన్.
– వలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం.
– కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు.
– మెగా డీఎస్సీపై తొలి సంతకం.
– ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల.
– ఆడపిల్లలకు విద్య కోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం.
– రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా.