Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తామని, ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల్లో 200 సీట్లకు పైగా సీట్లను గెలుచుకుంటామని, దేశవ్యాప్తంగా 400 స్థానాల్లో విజయం సాధిస్తామపి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పదేళ్లు పూర్తి మెజారిటీతో నడిపాం, రిజర్వేషన్లు రద్దయ్యాయా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేస్తూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని విమర్శించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా మాట్లాడారు.
కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొనకడం లేదని అన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడైన భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సస్పెండ్ అయ్యారని, అయినప్పటికీ ఆయన కాళ్లు పట్టుకుని అభ్యర్థిగా నిలబెట్టారని విమర్శించారు. దేశవ్యాప్తంగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు కేటాయించిందని, భువనగిరిలో టెక్స్ టైల్స్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేశారని అమిత్ షా తెలిపారు. భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు, సూర్యపేట నుంచి సిద్దిపేట వరకు రూ. 140 కోట్లతో జాతీయ రహదారులను నిర్మించామని తెలిపారు.