Glass Symbol : జనసేన పోటీలో లేని శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో ఓటర్లను ఆయోమయంలో పడవేసేందుకు వైసీపీయే ఈ కుట్రకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తోంది. అయితే ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది.
ఎన్డీయే కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రధానంగా ఎన్డీయే అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల.. స్వతంత్రులుగా పోటీ చేస్తున్న రెబల్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 50కి పైగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు ఎన్నికల సంఘం కేటాయించింది.