RCB Vs PBKS : ఆర్సీబీ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. ధర్శశాలలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కొహ్లి 92 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 241 పరుగులు చేసి ఇన్సింగ్స్ ను ముగించింది. విరాట్ ఆరు సిక్సులు, ఏడు ఫోర్లతో చెలరేగి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రజత్ పటిదార్ ఆరు సిక్సులు మూడు ఫోర్ల సాయంతో 55 పరుగులు చేయగా.. కెమెరూన్ గ్రీన్ 27 బంతుల్లోనే 46 పరుగులు చేసి ఔటయ్యాడు.
పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, విద్వత్ కావేరప్ప తక్కువ పరుగులు ఇవ్వగా.. రాహుల్ చాహర్ మూడు ఓవర్లు వేసి 47 పరుగులు, సామ్ కర్రన్ మూడు ఓవర్లు వేసి 50 పరుగులు సమర్పించుకున్నారు. హర్షల్ పటేల్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి 38 పరుగులు ఇచ్చాడు. కావేరప్ప నాలుగు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
242 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఆదిలోనే ప్రభుసిమ్రన్ వికెట్ కోల్పోయింది. అనంతరం జానీ బెయిర్ స్టో, ర్యాలీ రోసో ఇద్దరు బౌండరీలు, సిక్సులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జానీ బెయిర్ స్టో 16 బంతుల్లోనే 27 పరుగులు చేసి ఔట్ కాగా, ర్యాలీ రోసో 27 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లలో ఆర్సీబీ బౌలర్లపై ఎటాకింగ్ కు దిగాడు. దీంతో 5.5 ఓవర్లలోనే 71 పరుగులకు చేరుకుంది.
అయితే జానీ బెయిర్ స్టో కొట్టిన షాట్ గాల్లో కి లేవడంతో కెప్టెన్ డుఫ్లెసిస్ వెనక్కి పరుగెత్తుకుంటూ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్. శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించిన విరాట్ కొహ్లి రనౌట్ చేయడంతో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, ఫెర్గూసన్ 2 వికెట్లతో పంజాబ్ ను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ కేవలం 17 ఓవర్లలోనే 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా పంజాబ్ అప్రతిష్ట మూటగట్టుకుంది.