CM Jagan : సిఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను విజయవాడ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, పలువురు అనుమానితులను విచారించి సతీశ్ అనే యువకుడు దాడిచేసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. సతీశ్ కు దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిమెంట్ రాయి ముక్కతో దాడి చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడితో పాటు అదుపులోకి తీసుకున్న వారి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఏకంగా విజయవాడ కోర్టులో నిందితులను ప్రవేశపెట్టనున్నారు.
సిఎం జగన్ పై రాయి విసరడం రాజకీయ విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ప్రజల్లో రాగద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా సానుభూతితో రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంఘటనపై కూడా అలాంటి యత్నాలే చేశాయి.