తెలంగాణ పాఠశాల విద్యా రూపురేఖలను మరింతగా మార్చేందుకు రాష్ట్ర సర్కార్ నడుం బిగించింది. పోయిన విద్యా సంవత్సరం మన ఊరు-మన బడి ప్రోగ్రాం ద్వారా చాలా పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించగా..ఈసారి ఆ టార్గెట్ 3 వేల స్కూళ్లుగా పెట్టుకుంది. ఈ విద్య సంవత్సరం దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను నవీకరించాలని భావిస్తోంది. అందుకోసం రూ.300 కోట్లను వెచ్చించనుంది.
మొదటగా మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన ప్రతీ పాఠశాలలో రెండు క్లాస్ రూంలను డిజిటలైజేషన్ చేయనుంది. గత ఏడాది కొన్ని క్లాస్ రూంలను చేసినప్పటికీ..ఈసారి ఆ టాస్క్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈసారి మొత్తం 3 వేల పాఠశాలలను డిజిటలైజేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అందుకు తగ్గేట్లే నిధులను వెచ్చించనుండడంతో..క్షేత్ర స్థాయి లో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సర్కార్ జిల్లా అధికారులకు సూచించింది.
ఈసారి ప్రతీ పాఠశాలకు రూ.10లక్షల చొప్పున ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు అందుబాటులో ఉన్న స్థానిక నిధులను కూడా ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. స్థానిక నేతలు,దాతలు వంటి వారు ఆర్థిక సాయం చేస్తే వాటిని పాఠశాలల డెవలప్మెంట్ కోసం వాడాలని ప్రభుత్వం చెబుతోంది.
దాతలు ఇచ్చే డబ్బులతో స్కూళ్లలో డెక్కులు,బల్లలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడేలా డ్రాయింగ్,చిత్ర పటాలను వేయంచాలని సూచించింది. ప్రతీ పాఠశాలలో రెండు క్లాస్ రూంలను డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చుతున్నందున వాటికి అవసరమైన ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు,డిజిటల్ తెర,ఇతర సామాగ్రిని సర్కార్ మంజూరు చేసే డబ్బుల ద్వారా కొనుగోలు చేయాలని తెలిపింది.