Vizag Steel Plant :
ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఏపీలో వైసీపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తున్నదనే ఊహాగానాలు బలపర్చేలా కదలికలు ఉంటున్నాయి. ఇటీవలే ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసిన కేంద్రం,తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక వైసీపీకి మేలు చేసే అంశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీకి ఆర్థికంగా నిధుల సమీకరణకు కూడాకేంద్రం ఇటీవల సహకరిస్తున్నది.
అయితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విశాఖను ఇప్పటికే నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీ జాబితాలో చేర్చారు. కొంతకాలంగా రాజకీయంగా వివాదంగా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా తెరపైకి వచ్చింది. దీనిని విరమించుకోవాలని ఏపీ సీఎం జగన్ కూడాకేంద్రానికి లేఖ రాశారు. ఇక ప్రైవేటీకరణ నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం పునరాలోచనలో ఉందని, యథాతథ స్థితిని కొనసాగించేలా కేంద్రం నుంచి సంకేతాలు అందుతున్నాయని మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం దాదాపు నిలిచిపోయినట్లేనని, ఇక సంస్థను లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కేవలం 30 వేల మంది కార్మికులదేకాదని, ప్రజలందరిది అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో యాజామాన్యం నిర్వాకం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని జీవీఎల్ ఆరోపించారు. ఇక స్టీల్ ప్లాంట్ పై కేంద్రం పునరాలోచనలో ఉందనే వార్త కార్మికులకు పెద్ద ఊరటగా మారింది.