Chandrababu : తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. అయితే బీజేపీతో అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుల అంశంపై సమయం మించిపోయిందని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఒక కమిటీ వేశామని, వారు తమ పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఏపీలో పొత్తులు పెట్టుకొని బరిలోకి దిగుతామని చెప్పారు.
టీడీపీ గతంలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉంది. ఇక ముందు కూడా ఉంటుంది. ఇండియా కూటమికి లీడర్ ఎవరనేది స్పష్టం కావాల్సి ఉందన్నారు. రాజకీయ అనుభవం ఉన్నవాళ్లేవరూ మోదీని విమర్శించడం లేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి పై నాకు ఉన్న సంతృప్తి మరే లీడరుకు ఉండదని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదు. సౌతిండియాలో చూసుకుంటే తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ బలంగా కనిపిస్తున్నది. ఇదే విధంగా ప్రధాని మోదీ భారత్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారన్నారు. మోదీకి ఇప్పుడు తిరుగులేదని, అయితే ఇండియా కూటమిని లీడ్ చేసే నేత ఎవరో ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
రూ. 500, ఆపై కరెన్సీ నోట్లను రద్దు చేయాలని గతంలో నేనే చెప్పానని, తద్వారా ఎన్నికల్లో నగదు పంపిణీ నిలిచిపోతుందన్నారు. మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని జగన్ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణం ఆగిపోయింది. పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తే ఉత్తమ రాష్ర్టంగా ఏపీ నిలుస్తుందన్నారు. పోలవరం పూర్తి చేస్తే ఉత్తమ రాష్ర్టంగా ఏపీ నిలిచేదని స్పష్టం చేశారు. రాష్ర్టం బాగుపడాలంటే జగన్ గద్దె దించాలని అన్నారు.