YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు, ప్రచారం ఇలా చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలింగ్ తర్వాత రిలాక్స్ కావాలని, అందుకు అవసరమైన విరామం తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్నారు. పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత అంటే మే 15వ తేదీ ఏపీ నుంచి బయల్దేరనున్నారు.
ఈ నెల 15 నుంచి రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్విడ్ ప్రోకో కేసుల్లో ఆయన విచారణను ఎదుర్కొంటున్నందున సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది.
జగన్ ప్రతీ వేసవిలో చేసే విదేశీ పర్యటన అసాధారణమైనదేమీ కాకపోయినా, ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసి కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నారని, దాని నుంచి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలని సొంత సోదరి వైఎస్ షర్మిల ప్రయత్నించారు.
అనివార్యమైన ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే జగన్ ఎన్నికల తర్వాత దేశం విడిచి పారిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. ఓడిపోతే అరెస్టు చేస్తారేమోనని కూడా భయపడే అవకాశం ఉందని ఆమె ఆరోపించారు.
మరోవైపు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల తర్వాత వారం పాటు కుటుంబంతో సహా సింగపూర్ లేదా స్విట్జర్లాండ్ విహారయాత్రకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా ఎన్నికల్లో తమ పార్టీల గెలుపునకు జగన్, చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఎన్నికల తర్వాత విహారయాత్రకు ప్లాన్ చేసుకోవడంలో తప్పేమీ లేకున్నా.. ప్రతిపక్షాలు మాత్రం ఏదో జరగబోతోందని విమర్శలు గుప్పించడం గమనార్హం.