America : అమెరికాలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదేంటి ఆయన అక్కడ పోటీ చేస్తు్న్నారా .. అనుకుంటున్నారా..? కాదండోయ్.. అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుడి తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే అమెరికాలోని పలు రాష్ర్టాలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో మనోళ్లు పోటీ చేస్తూనే ఉంటారు. ఇప్పడు కూడా మిషిగన్ రాష్ర్టంలోని నోవై నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కృష్ణ జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ పెద్దిబోయిన జోగేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. అయితే జోగేశ్వర్ రావుకు మద్దతుగానే యార్లగడ్డ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన గెలుపును కాంక్షిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నోవై ప్రస్తుత, మాజీ మేయర్లు కూడా పాల్గొన్నారు. స్థానిక రాజకీయాల్లో సేవా కార్యక్రమాల్లో సొంతింటిలో శుభకార్యం మాదిరి ముందు వరుసలో నిలబడే ధైర్యం చేయాలని ఆయన కోరారు. తాను ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా తన మిత్రులకు, స్నేహితులకు, శిష్యులకు స్థానికంగా మనల్ని మనం బలోపేతం చేసుకోవాలని చెబుతుంటానని పేర్కొన్నారు.
జోగేశ్వర్ రావు విజయం సాధించాలని ఆకాంక్షించారు. భారతీయులు అమెరికాలో ఉన్నత స్థానంలోకి రావడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. నోవైలోని భారతీయులతో జోగేశ్వర్ రావుకు సత్సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా యార్లగడ్డ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగేశ్వర్రావు ఎన్నికల ఖర్చుల కోసం యార్లగడ్డ కుటుంబ సభ్యులు 3375 డాలర్లు విరాళంగా అందజేశారు. అమెరికాలో ప్రతి అభ్యర్థి ఇలా ఎన్నికల ఖర్చుల కోసం విరాళాలు వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మరికొందరు కూడా జోగేశ్వర్ రావు కు విరాళాలు అందజేశారు.