కేంద్రంలోని బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని అంబేద్కర్ మనవడు ప్రకటించడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆయన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ)కి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడిగా అందరికీ సుపరిచితుడే. పార్టీ పరంగా పెద్ద బలం లేకున్నా. మనుగడలో మాత్రం ఉంది. అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచనలమయ్యాయి. కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి తెలంగాణలో బీజేపీని ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని దళితులకు ఆయన సూచించారు.
అయితే ఇటీవల దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ పై తమకు ఎంతో అభిమానం ఉందని ప్రకటించారు. మరోవైపు రాష్ర్టంలో నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. పార్లమెంట్ కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే తెలంగాణలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ను ఆహ్వానించారు. ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ను అభినందించి, ధన్యావాదలు తెలిపారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే ఆయన కేసీఆర్ కు అండగా నిలవాలని చూస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. బీజేపీని రాష్ర్టంలో ఓడించడానికి తమ పార్టీ 119 సీట్ల లో పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా కేసీఆర్ కు మేలు చేయాలని భావిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దళితుల పార్టీగా పేరున్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా బరిలోకి దిగితే కొంత ఆదరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఆ పార్టీకి పడే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అవుతాయని, అంతిమంగా ఇవి కేసీఆర్ కు మేలు చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. తన తాత విగ్రహాన్ని భారీ ఎత్తున పెట్టిన కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ప్రకాశ్ అంబేద్కర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.