GVL : ఏపీలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ జరిగింది. ఈ సభ కోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. ప్రజలను తరలించాయి. అయితే సభలో అమిత్ షా మాట్లాడుతుంటే తెలుగులో అనువాదించే బాధ్యతను బీజేపీ నాయకుడు జీవీఎల్ కు అప్పగించారు. అయితే అనువాదం చేయడంలో జీవీఎల్ తడబడ్డారు. అయితే ఆయన అనువాదం చేస్తున్న తీరుపై ఎందుకో అమిత్ షా కు అనుమానం వచ్చింది. వెంటనే జీవీఎల్ ను మందలించారు. నేనేం చెబుతున్నాను.. మీరేం చెబుతున్నారు అంటూ అడిగారు.. దీంతో వినపడడం లేదు అంటూనే జీవీఎల్.. కాగితం పై రాసుకునే ప్రయత్నం చేశారు.
బహిరంగ సభలో జీవీఎల్ వ్యవహరించిన తీరు చూసి అంతా చర్చించుకున్నారు. జగన్ పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేస్తే జీవీఎల్ మాత్రం కొన్నింటినే ప్రజల ముందుంచారనే విమర్శలు వచ్చాయి. ఇక జీవీఎల్ తీరుపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ తీవ్ర ట్రోల్స్ చేసింది. బీజేపీ నేతలు కూడా జీవీఎల్ తీరును సమర్థించలేదు. సెఫాలజిస్ట్ గా బీజేపీ పెద్దలకు దగ్గరైన జీవీఎల్ రాజ్యసభ సభ్యత్వంతో పాటు అధికార ప్రతినిధి పదవి కూడా పొందారు. అయితే ఆయన పనితీరు చూసి ఈ అధికార పదవి నుంచి తొలగించారు. ఇక త్వరలోనే ఈ రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియబోతున్నది. అయితే పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ దశలోనే ఆయన ఇటీవల విశాఖలో హడావుడి చేస్తున్నారు. ఇక నిన్నటి అనువాద ఘటనతో జీవీఎల్ పరువు కాస్త పోయిందని అంతా చర్చించుకుంటున్నారు. బీజేపీ నుంచి ప్రతిపక్షాలపై విమర్శలు చేసే జీవీఎల్ ఇప్పుడు నవ్వుల పాలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.