కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తంతు ముగిసింది. ఇక ప్రభుత్వం ఏర్పాటుదిశగా కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తు్న్నది. అతిపెద్ద పార్టీగా ఆపార్టీ సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అంశంపై మరికాసేపట్లో సమావేశం కాబోతున్నది. మరి కొన్ని గంటల్లో సీఎం ఎవరనేది తేలనుంది. ఇప్పటికే అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలువస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓటింగ్ సరళిపై బీజేపీ లెక్కలు వేసుకుంటున్నది. తాము ఎక్కడ విఫలమయ్యామనేది తెలుసుకుంటున్నది.
కమలానికి తెలుగు షాక్
బీజేపీకి తెలుగు రాష్ర్టాల ప్రజలు షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తున్నది. కర్ణాటకలో దాదాపు ఎనిమిదికి పైగా జిల్లాల్లో తెలుగు వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో సుమారు 50 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. కాగా, ఇందులో కేవలం 6 నుంచి 7సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకున్నట్లు సమాచారం. బళ్లారి, చిక్ బళ్లాపూర్ లాంటి చోట్ల కూడా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈ ఫలితాలు బీజేపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తున్నారు.
బీజేపీ పై తీవ్ర వ్యతిరేకతే కారణమా..
కర్ణాటకతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగానే బీజేపీ ఓడినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు వారిలో కూడా ఇదే బీజేపీకి ఓటు వేయకుండా చేసిందని చెబుతున్నారు. ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని చెబుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఇది కొంత నిరుత్సాహాన్ని కలిగించే అంశమేనని చెబుతున్నారు. ఇక మోడీ మానియాపై కొంత ఆలోచించే సమయం వచ్చిందని అంటున్నారు. మరి బీజేపీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగిందనే ప్రచారం కూడా సాగుతున్నది. ఇక తెలంగాణపై వారి దృష్టంతా పడిందని చెబుతున్నారు.