– వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ
Korutla Hospital : ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు కోరుట్ల ప్రభుత్వ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు వైద్యుడు, సిబ్బందిపై దాడి చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం..
కోరుట్లలోని హాజిపురకు చెందిన నజీబుర్ రెహమాన్ (44) ప్యాసింజర్ ఆటో నడిపిస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం పట్టణ శివారులోని డీ-40 ఏరియాలో ఎండవేడికి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సిబ్బంది పరిశీలించి చలనం లేదని తెలిపారు. వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స అందించాలని సిబ్బందిని కుటుంబ సభ్యులు కోరారు. ఈ క్రమంలో కాలయాపన జరగడంతో వైద్యులు అందుబాటులో లేని కారణంగానే వ్యక్తి మృతి చెందాడని బంధువులు, స్థానికులు ఆసుపత్రి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వైద్యుడు శ్రవణ్, సిబ్బందిపై దాడి చేసేందుకు యత్నించగా వారు గదిలోకి వెళ్లి తలదాచుకున్నారు. వారిపై డీజిల్ పోసి నిప్పంటించడానికి యత్నించారు.
దీంతో పోలీసులు వైద్యుడు శ్రవణ్ ను, సిబ్బందిని పోలీస్ స్టేషన్ కు తరలించే యత్నం చేయగా వెంబడించి దాడిచేయగా వైద్యుడికి గాయాలయ్యాయి. మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు, కోరుట్ల సీఐ సురేశ్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. బాధితులతో మాట్లాడి గొడవ సద్దుమనిగేలా చేశారు. ఆందోళనకారులపై వైద్య బృందం ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.