pawan kalyanఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడుత వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఏలూర్ లో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో 15వేల మంది మహిళల అచూకీ తెలియడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఒంటరి మహిళల వివరాలను వలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు ఇస్తుంటే, ఓ మాఫియా ముఠా మిగతా పని కానిచ్చేస్తున్నదని తమకు కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి సమాచారం ఉందని చెప్పారు. ఇప్పటివరకు 29 వేల మంది మిస్సయితే, 14 వేలమంది అచూకీ తెలిసిందని, మిగతా 15 వేల మంది ఏమయ్యారనేది ఇప్పుడు అనుమానంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారాయి. ప్రతి గ్రామంలో దీనిపై చర్చ కొనసాగుతున్నది. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు ఏపీ పోలీసుల వద్ద ఈ సమాచారం ఉందా.. లేదా అనే సంశయం ప్రజల్లో కలుగుతున్నది. ఇంతమంది ఎక్కడికి వెళ్లారు.. ఏమయ్యారు.. తదితర వివరాలు పోలీసులు బయట పెట్టాల్సి ఉంటుంది. దీనిపై అసలు పోలీసులు ఏం చెబుతారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
పవన్ ఆరోపణలు నిజమే అయితే మాత్రం ఇది ప్రభుత్వం, పోలీసుల ఫెయిల్యూర్ అవుతుంది. ఈ మాఫియా ఎవరనేది తేల్చాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే మహిళల అదృశ్యంపై వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే పవన్ చెప్పినట్లు వేల మంది మిస్సయ్యారంటేనే ఇప్పుడు అందరిలో భయాందోళన మొదలవుతుంది. పవన్ చెప్పినట్లు వలంటీర్ల పాత్ర ఇందులో ఉంటే, ఇక వారిపై అనుమానాలు మొదలవుతాయి. నిజానికి వలంటీర్ల వద్ద ప్రతి ఇంటి సమాచారం ఉంటుంది. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. దీనిపై కూడా వలంటీర్లే ఇదంతా నడిపిస్తున్నారని గతంలో టాక్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా మహిళల మాయం అంటూ ప్రచారం జరుగుతున్నది. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని జనసేన, టీడీపీ వర్గాలు కోరుతున్నాయి.