Farmers Suicides : మన దేశం వ్యవసాయిక దేశమని తెలిసిందే. సగానికి పైగా జనాభా భూమిని నమ్ముకునే బతుకుతారు. పంట పండితేనే రైతులు ఇంట్లో పండుగ. ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే వేళ వరదలు, తుఫాన్ లు వచ్చి ఆ పంటను ఎత్తుకెళితే ఆ రైతు కుటుంబం ఆవేదన ఎవరికీ తెలుస్తుంది. ‘‘విత్తనాల ధరలు పెరిగాయి.. ఫెర్టిలైజర్ల ధరలు పెరిగాయి.. కూలీల ధరలు పెరిగాయి.. ట్రాన్స్ పోర్ట్ ధరలు పెరిగాయి..’’ మరి తమ పంటకు ధర ఎందుకు పెరుగలేదని రైతన్న అడిగితే సమాధానం చెప్పేవారు ఒక్కరైనా ఉన్నారా? దేశంలో, మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇది.
తాజాగా జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం.. దేశ వ్యాప్తంగా 11వేల మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. వారానికి సగటున 11 మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుడు ఆత్మహత్య చేసుకున్న 11,290మందిలో ఏపీ రైతులు 915 మంది. వీరిలో రైతులు 309 మంది, కౌలుదారులు 608 మంది. ఇవి గణాంకాలలో ఆత్మహత్యలే కానీ వాస్తవానికి ఇవి ప్రభుత్వ హత్యలు అని చెప్పక తప్పదు.
ఏపీలో జగన్ ప్రభుత్వం ‘‘గత ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 5లక్షల రూపాయలు ఇచ్చేది. మేము రూ.7లక్షలు ఇస్తున్నాం.. నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నాం’’ అని ఘనంగా చెప్పుకుంటోంది. ఆత్మహత్యలకు మూలాలు తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కదా. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఏం చర్యలు తీసుకున్నారు.. వారికి కష్టాలు రాకుండా ఏ చర్యలు తీసుకున్నారు.. వారికి పెట్టుబడి సాయం ఎంత అందిస్తున్నారు.. వారికి రుణసౌకర్యం ఎలా కల్పిస్తున్నారు.. వారి పంటలకు నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, రవాణా సౌకర్యం, మార్కెటింగ్ సౌకర్యం.. ఇవి కదా రైతుకు కావాల్సింది. ఇవన్నీ లేకనే కదా రైతు ఆత్మహత్య చేసుకునేది. ఏదో కంటితుడుపు చర్యగా అన్నదాత ఆయువు అనంతలోకాల్లో కలిశాక మీరేన్ని డబ్బులు ఇచ్చినా అతడి ప్రాణాలు తీసుకురాగలరా? ఆ ఇంటి పెద్ద లేని లోటు ఆకుటుంబానికి తీర్చగలరా?
ఏపీలో రైతులకు ప్రధాన సమస్య తుఫాన్లు..ఎప్పుడూ పంట చేతికొచ్చిన సమయంలో మాయదారి తుఫాన్లు వచ్చి పంటను నీళ్లపాలు చేస్తుంటాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. రాష్ట్రంలో వరి పంట చేతికొచ్చే సమయంలో(నవంబర్, డిసెంబర్) తుఫాన్లు వస్తాయి. వీటితో 60శాతం పంటలు దెబ్బతింటాయి. కనుక పంట కాలాన్ని ముందుకు జరిపుతూ పంట క్యాలెండర్ తయారు చేయాలి. అంటే జూన్ లోనే నీరు విడుదల చేస్తే రైతులు నాట్లు వేసుకుంటారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసి సానుకూల ఫలితాలు రాబట్టింది. మూడు పంటలు చేతికందాయి. కానీ గత ప్రభుత్వ ఆలోచనలన మనం ఎందుకు అనుసరించాలని నిర్లక్ష్యంతో పట్టిసీమ పథకాన్ని నీరుగార్చింది. ఈ ఏడాది ఒక్క వారం రోజుల ముందు కోతలు, కుప్పలు, నూర్పిళ్లు పూర్తయితే ‘మిగ్ జాం’ తుఫాన్ నష్టం ఇంత ఉండేది కాదు. ఈ పంటల నష్టానికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వానిదే.
ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని ఎన్నెన్నో ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇప్పటికైనా పాలకుల ప్రాథమ్యాలు మారాలి. రైతే మొదటి ప్రాధాన్యం కావాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. తద్వారా దేశం బాగుంటుంది.. మిగతా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారు. అదే రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉసురు తగిలేది దానికి బాధ్యులైన పాలకులకు మాత్రమే. అందుకే మన పెద్దలు అంటారు.. ‘‘రైతు ఏడ్చిన రాజ్యం..ఎద్దు ఏడ్చిన ఎవుసం.. బాగుపడవు’’.