Amit Shah :
తెలంగాణలో ఎన్నికల వేడి మరింత వేడెక్కింది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115
స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ వారిపై ఎవరిని నిలబెట్టాలని వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం (ఆగస్ట్ 26) ‘ప్రజా గర్జన’ పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ పెట్టి ‘ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్’ ఇప్పించారు కాంగ్రెస్ నాయకులు.
ఇక ఆదివారం (ఆగస్ట్ 27)న ‘రైతు ఘోష- బీజేపీ భరోసా’ పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పిలిపించిన కమలనాథులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఖమ్మం సభ తర్వాత బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి..? బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలతో మాస్టర్ ప్లాన్ను షా కమల దళానికి వివరించి దిశా నిర్దేశం చేశారు.
అందులో ఏం చెప్పారంటే.?
ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులను షా తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఈ పథకం ప్రకారమే పోరాడాలని నేతలను ఆదేశించారు. పలు కీలక సలహాలు, సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా.. సబ్బండ వర్గాలను ఆకట్టుకోవడం, ‘బీజేపీకి పట్టున్న స్థానాలు.. ఇటు అసెంబ్లీ, అటు లోక్సభ గెలిచే అభ్యర్థుల స్థానాలు. ఎక్కడ సెకండ్ ప్లేస్ లో ఉండగలుగుతాం?’ అని బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. గెలుపునకు అధిష్ఠానం నుంచి కావాల్సిన సహకారంపై షా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రతీ 10 రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి ఒకరు వస్తారని కూడా చెప్పినట్లు సమాచారం.
‘తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. ఆ దిశగా కష్టపడాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తి నేతలను ఆహ్వానించండి. మజ్లిస్, బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ఎత్తుగడలపై ప్రధానంగా దృష్టి నపెట్టాలి. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చేసే పనులు తదితరాలను వివరించాలి. పార్టీలో అధిపత్య పోరు, గ్రూపు విభేదాలు పక్కన పెట్టి కొట్లాడాలి. వివాదాల జోలికి వెళ్లకుండా ఐక్యంగా పోరాటం చేయాలి.’ అని మాస్టర్ ప్లాన్ వివరించారు షా.
కొన్ని రోజులుగా బీఆర్ఎస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని.. కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఖమ్మం వేదికగా ఇది బట్టబయలైంది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘జనగర్జన’ సభకు కేసీఆర్ సర్కార్ బస్సులు ఇవ్వలేదు. దీనికి తోడు పొంగులేటి అభిమానులు వస్తున్న వాహనాలను పోలీసులు అడ్గుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అమిత్ షా కు మాత్రం పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి. బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ బస్సులు ఏర్పాటు చేసింది. ఇది దేనికి సంకేతం అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ ఎలాంటి కామెంట్ చేస్తుందో చూడాలి మరి.