Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు చుండి నాగభూషణం. మార్చి 19, 1922 అనకర్పూడి ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల జాబ్ చేయక తప్పక పోవడంతో మద్రాస్ వెళ్లిపోయారు. సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 1941 లో పెళ్లి చేసుకున్న భార్య సుబ్బరత్నం అకాల మరణం నాగభూషణాన్ని బాధించింది. అనంతరం శశిరేఖ అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
నాగభూషణం 1954 లో మొదటిసారి పల్లెటూరు సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఆయన తెలుగులో ప్రతినాయకుడి (విలన్ ) పాత్రలు పోషిస్తూ మెప్పించారు. హిరోకు సమానంగా విలన్ ఉండాలనేలా చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించే వాడు. విలన్లు కామెడీ కూడా చేయగలరని నాగభూషణం నేర్పించాడు. నాగభూషణం విలన్ పాత్రలకు బోలెడంతా మంది ఫ్యాన్స్ ఉండేవారు.
అమరసందేశం, పెంకీ పెళ్లాం, ఏదీ నిజం, మంచి మనుసులు సినిమాలు నాగభూషణానికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. శ్రీకృష్ణ విజయం, మాయ బజార్, కురుక్షేత్రం లాంటి పౌరాణిక సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు. నాగభూషణం నిర్మాతగా కూడా పని చేశాడు. నాటకాల రాయుడు (1969) ఒకే కుటుంబం (1970) చిత్రాలను రవి ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించారు. అమ్మమాట, కథానాయకుడు, అడవి రాముడు లలో నాగభూషణం నటననే స్ఫూర్తిగా తీసుకుని రావు గోపాల్ రావు తర్వాతి సినిమాల్లో అచ్చం అలాగే నటించడంటే నమ్మశక్యంగా ఉండదు.
సినీ కళాకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి నాగభూషణం. ఈయన రక్తకన్నీరు నాటిక ద్వారా దాదాపు దేశ వ్యాప్తంగా 25 సంవత్సరాలు పాటు అనేక ప్రదర్శనలు ఇస్తూ ఎంతో మంది కళాకారుల ఆకలి తీర్చారు. సినిమాల్లో విలన్ పాత్రలే పోషించినా ఆయన నిజ జీవితంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి గొప్ప వ్యక్తి అని అనిపించుకున్నారు.