CM Jagan Plan :
నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, వివిధ శిక్షణల ద్వారా వారికి ఉపాధి కల్పించే మహోన్నత లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సుమారు 2 లక్షల మంది ఇందులో చేరి, శిక్షణ పొందినట్లు ఇప్పటివరకు ఉన్న అంచనా, వేలాది మంది వీటి ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందుతున్నట్లు కూడా సమాచారం. ఈ సెంటర్లను టీడీపీ ప్రభుత్వం ఎంతో ఉత్తమంగా తీర్చిదిద్దింది. ఇందుకు గాను 2019లో అవార్డు కూడా లభించింది. కానీ అప్పటికే ప్రభుత్వం మారడంతో దీనిని వైసీపీ ప్రభుత్వం అందుకుంది.
కానీ ఇప్పుడు అవే సెంటర్లలో అవినీతి అంటూ వైసీపీ ప్రభుత్వం పెద్ద ప్లాన్ రెడీ చేసింది. వివిధ అభియోగాలు మోపుతూ అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసింది. అయితే నిజానికి టీడీపీ చేసిన ఏ మంచి పనిని కూడా వైసీపీ కొనసాగించలేదు. అన్న క్యాంటీన్లు, ప్రజావేదిక ఇలా అన్నింటి విధ్వంసానికే దిగింది. బటన్ నొక్కుతున్నాం.. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే ధోరణితోనే ముందుకెళ్తున్నది. ఇదే క్రమంలో 2021 నుంచి అసలు స్కిల్ సెంటర్లను పట్టించుకోవడమే మానేసింది. ఇక ఇప్పుడు కేసుల నేపథ్యంలో స్కిల్ సెంటర్లకు పేరు మార్చే పనిలో పడింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టాలని యోచిస్తున్నది. దీనిని పూర్తిగా కేంద్రం పరిధిలోకి తేవాలని ఏపీ సీఎం ఆలోచిస్తున్నారు. అయితే ఎన్నో పథకాలు ఉండగా, ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్ సెంటర్లకే ప్రధాని మోదీ పేరు ఎందుకు పెట్టారో బీజేపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికే స్కిల్ స్కాం అంటూ చంద్రబాబును ఇరికించేశారు.. ఇఫ్పుడు కేంద్రాన్ని ఇందులోకి దించుతున్నారు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పటికే ఆయా కేంద్రాల్లో మోదీ ఫొటోతో పాటు ప్రధాని కౌశల్ యోజన అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. చూశారుగా.. నిరుద్యోగులకు మంచి చేసే సెంటర్ల విషయంలోనూ సీఎం జగన్ చేతులెత్తేశారు. నిధులు లేవు రాజధాని కట్టలేం.. నిధులు లేవు పోలవరం కట్టలేం. నిధులు లేవు జీతాలు ఇవ్వలేం.. ఇప్పుడు తాజాగా నిధులు లేవు ఇక సెంటర్లు నడపలేం అనే స్థితికి వచ్చారని టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. ఇక నిధులు లేవు.. ప్రభుత్వాన్ని నడపలేం అంటూ రాజీనామా కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేర్లు మార్చడం.. రంగులు వేయడం.. బటన్ నొక్కడం మినహా జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.