Jagan : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు, నేతలు అంతా సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో నేతల హడావిడి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుల లెక్కలు కూడా క్లైమాక్స్ కు వచ్చినట్టు కనిపిస్తోంది. జనసేనకు ఓ నెంబర్ ఫిక్స్ చేసి ఇక ప్రచారంలోకి దిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వైసీపీ ఆల్రెడీ 175 టార్గెట్ తో ముందుకెళ్తోంది.
ఇలా ఏ పార్టీ లెక్కలు, స్ట్రాటజీలు ఉండగా.. పార్ఠీల అధినేతలకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయం వెంటాడుతోంది. టీడీపీకి జగన్ భయం.. అందుకే జనసేనను కలుపుకుంది. అలాగే జనసేనకు జగన్ భయం.. అందుకే వారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. వీరిలాగే జగన్ ను కూడా రెండు భయాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి.
టీడీపీ, జనసేనలతో కలిసి బీజేపీ పోటీ చేస్తే ఓరకంగా చూస్తే తనకు లాభం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారు. ముస్లిం, క్రిస్టియన్లు, ఎస్సీల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి పడుతాయనే అంచనాతో ఉన్నారు. ఇదే క్రమంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఒకే దగ్గర పొలరైజ్ అయితే వైసీపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదే విషయమై జగన్ ఆందోళనగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే తన ప్రభుత్వంపై వ్యతిరేకత చీలి రెండు పార్టీలకు చీలి.. చివరకు తానే అధికారంలోకి రావొచ్చు అని జగన్ భావిస్తున్నారు. ఇందులో ఒకే అంశంలో వైసీపీకి లాభం జరగొచ్చు.. లేదా నష్టం జరగొచ్చు.. అని భావించవచ్చు.
ఇక జగన్ భయపడే రెండో అంశం.. అభ్యర్థుల మార్పు. వాస్తవానికి వైసీపీ 175 టార్గెట్ తో ముందుకెళ్తూ.. సర్వేల ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ తో అభ్యర్థులను, నియోజకవర్గ ఇన్ చార్జులను మారుస్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో ఎలా వర్కవుట్ అవుతుందోననే భయం జగన్ తో పాటు ఆ పార్టీ నేతల్లోనూ కనపడుతోంది. బెడిసి కొడితే మాత్రం పెద్ద దెబ్బే. ఒకవేళ వర్కవుట్ అయితే మాత్రం రెండోసారి అధికారంలోకి రావడం పక్కా అని భావిస్తున్నారు. ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఎన్నికల దాక ఆగాల్సిందే.
పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా పార్టీల అధినేతలకు లోలోపల భయం వెంటాడుతోందని మాత్రం తెలుస్తోంది. జగన్ కు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ల భయం, టీడీపీ, జనసేనలకు బలమైన వైసీపీ ఎత్తుగడలను ఎలా ఢీకొట్టాలో అనే భయం పట్టుకుందన్నది మాత్రం వాస్తవం. రాజకీయ పార్టీలు తమ తమ సర్వేల ద్వారా జనం నాడీని పట్టే ప్రయత్నం చేసినా ఫీల్డ్ లెవల్ ఓటర్ నాడీని పట్టడం కష్టం. ఎన్ని చేసినా.. ఎన్నికల్లో వచ్చే ఓట్లే విజేతగా నిలుపుతాయి.